Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

చంద్రశేఖర మాశ్రయే
మమ కిం కరిష్యతి వైయమః.

''శ్రీ బులుసు సూర్యప్రకాశం''

ఉన్నట్టుండి ఊళ్ళోఅలజడి బయలుదేరింది. స్వాములవారు వస్తున్నారని వారిరాకతో ఈ పల్లెకూడ పావనమౌతుందనీ, స్వాములవారి దివ్యత్వ, మహత్వ జగద్గురుత్వాదుల ప్రశంస పెద్దనోళ్ళలో చిలువలు పలువలు పెంచుకొంటోంది. కాని షోడశవర్గీయులైన బాలబృందానికి ఇది ఏమీ పట్టలేదు. వారి ఉత్సాహకారణం వేరు. ఏనుగులు వస్తాయని, గుర్రాలు వస్తాయని, దంతపుపల్లకీ కపిలగోవూవస్తున్నదనీ, అన్నిటినీమించి, అన్న పానాలను కూడ మరపింపచేస్తున్నది ఏనుగు ఒక్కటే.

అమ్మమ్మతో వెళ్ళి స్వాములవారినీ, ఏనుగునూ పొరుగూరిలో చూచివచ్చినా డొకడు. వాడు గజరాజ కథాకథనవేళలో గద్దె ఎక్కీ కూచుంటున్నాడు. గజాన్ని గూర్చిన జ్ఞానంలో వాడొక్కడే విజ్ఞుడు. తక్కిన వారందరూ అజ్ఞులే. ఏనుగు ఆకారాన్నీ కరిమింగిన వెలగపండునూ వాడు చెప్పుతుంటే బాలమండలి శ్రవణపర్వంగా వింటోంటి.

కాలంగడిచేకొద్దీ ఆతురత పెరుగుతున్నది. ఆతురతోబాటు కబుర్లు. అమలాపురం వంతెనమీద ఏనుగు కాలువేసి ఊపిందట. వంతెన ఊగిపోతే కాలువలోదిగి వెళ్ళిందట. ఇంకేం స్వాములవారు వస్తున్నారు. అంతటితో బాలబృందం తూము దగ్గరకు పరుగెత్తి అక్కడ నిరీక్షించసాగింది.

ఒకరోజు అదృష్టం పండింది. నిజంగానే స్వాములవారు వేంచేశారు. వారిరాక రాత్రి ఎప్పుడో జరిగింది. ఉదయం బాలబృందం విన్నది. ఊరంతా స్వామి దర్శనంకోసంపరుగిడితే, బాలబృందం ఏనుగును దర్శించటానకి వెంకన్నగారి తోటలోని వెలగచెట్టుక్రింద చేరింది. చూడటం చూడటంతో బ్రహ్మానుభావమే కల్గింది వారికి- స్వామి సాహచర్యంతో, ఏనుగు కూడ బ్రహ్మానందం పంచిపెట్టటంలో శ్రీవారికి తీసిపోనట్లు నిరూపించుకొంది.

మాగ్రామం పల్లెటూరు. కొమానుపల్లె-వయా ముమ్మడి వరం- అమలాపుర తాలూకా, 1935 సం|| మట్టిరోడ్లూ తాటాకుల ఇళ్ళు, కొబ్బరితోటలు, చెరువు నీళ్ళు, వేదాధ్యయనం, శాస్త్రచర్చ, పురాణపఠనం, అతిథిసత్కారం, ఆచారనిష్ఠ- ఇవి తప్ప అన్యలోకం ఆ ఊరు ఎరుగుదు. స్వామి రాక ఆ ఊరికి ప్రాచీగర్భంలో సూర్యోదయమేఐంది స్వామివారి పరిచారక వర్గానికి ఊరివారి వీథి అరుగులు విడుదులయినాయి. సంపన్నులు స్వామికి భిక్షావందనం చేసి కృతకృత్యులైనారు.

ఊరికి రెండుమైళ్ళలో ఉన్న ఉత్తరవాహినిలో స్వామి అరుణోదయానికి పూర్వమే స్నానం చేసి ఊళ్ళోకి విజయం చేసినది ఈనాటికీ యథాతథంగా గుర్తున్నది. వేదవేత్తలు పల్లకిముందు పాదచారులై స్వస్తి చెప్పగా, పల్లకిలో కాషాయానికి కూడ ఆరుణ్యాన్ని ప్రసాదించే దేహకాంతితో, సుందరదరహాసంతో , పక్ష్మాంచలాలలో పరమకారుణికతను వెలయింప చేస్తూ మూర్తీభవించిన బ్రహ్మవర్చస్సువలె స్వామి వచ్చినారు. ఊరంతా రెండుపాయలై వారి దివ్య దర్శనంకోసం ముకుళిత కరకములమై నిలిచింది.

పిమ్మట, భిక్షకై ఆహ్వానించిన గేస్తు ఇంటిలో స్వాములవారు దేవీపూజ చేసేవారు. పూజకు ఊరంతా వచ్చేది. గోపూజ, గజపూజ కూడ స్వాములవారు చేసేవారు.

నాటి నాకు ఆరేళ్ళు. చాల సంతానంపోయి, నేను దక్కినాను. నా జాతకంలోనూ, బాలారిష్టాలకు కొదువలేదు. ఈ కారణంగా స్వామి అనుగ్రహం అర్థించాలని మాతల్లీ మేనమామ తలచినారు. కాని వారి సన్నిధికి వెళ్ళి అర్థించటం ఏలా? ప్రణతుడైన ప్రతిఒక్కరికీ, శ్రీవారి ఆశీస్సులభిస్తుంది. తలవని తలంపుగా వారికోరిక నెరవేరింది.

మా ఇంటి కెదురుగా తణికెళ్ళవారి ఇల్లు. వారి వీధి అరుగుపై శతాధివృద్ధులు, శ్రీజగద్గురు చంద్రశేఖర సరస్వతీ స్వాముల శిష్యులు, శ్రీసుబ్రహ్మణ్యంద్ర భారతీస్వాములు- (పేరుగుర్తు చాలదు) మకాం చేసేవారు. ఆయన వార్థక్యం, శ్రీవారి ¸°వనమూ, 'వృద్ధాశిష్యా గురుర్యువా' అని అనిపించేది. వయోధర్మంవల్ల శరీరపాటవంతగ్గి ఆయన శౌచాదికాలకు కూడ బయటికి వెళ్ళలేకపోయేవారు. అందుచేత తనికెళ్ళవారికి ఇబ్బందికాగా మా మేనమామ గమనించి, వారిని మావీథి అరుగునకు తరలించినారు. వారి దేవతార్చన, వారి ఇతరవస్తువులూ మావీథి అరుగును చేరింది.

ఈస్వామి జానకీకాంతునిచే ఆకర్ణాంతం లాగబడిన పరమశివుని కోదండంవలె శరీరయష్టి కలిగి భస్మదిగ్ధులైన కౌపినవంతులై యుండేవారు. వారు మొదటిరోజు మాఇంట్లో భిక్ష చేసినారు. రెండవరోజు చేయమన్నారు. ఒకేగృహస్థుని ఇంట్లో పదేపదే భిక్ష చేయరాదు. మరొక ఇంటికి వెళ్ళటానికి బలంలేదు. అందుచేత, నాచేత మధుకరం చేయించి ఆయనకు పెట్టేదానికి ఏర్పాటు ఐనది.

ఆయనవద్ద తాటాకుపెట్టెలో రుద్రాక్షమాలలు చిన్నవీ పెద్దవీ చాల ఉండేవి. ఆయన రోజూ వానిని ధరించేవారు అప్పుడు ఆయన రూపం'కేయూరీకృతకంకణీకృత జటాజూటా వతంసీకృతజ్యావల్లీకృతకుండలీకృతకటీసూత్రీకృతాహీశ్వరః అన్నట్టు వుండేది. వారికి సర్వాంగ అలంకారం రుద్రాక్షేలే. ఆ స్వామితో మా మేనమామ నన్ను గూర్చి చెప్పినాడు.

ఒకరోజు అగ్రహారంలో మామిడిపల్లి చిట్టెన్నగారి ఇంట్లో జగద్గురువులకు భిక్ష జరిగింది. ఆ సంతర్పణకు నేనూ వెళ్ళివస్తున్నా. మా మేనమామ సుబ్రహ్మణ్యంద్ర భారతిని ఎద్దుబండిలో కూచోబెట్టి పసులకాపరిచేత లాగిస్తూ, చిట్టెన్న గారి ఇంటికి తీసుకొని వెడుతూ, నన్ను కూడ ఆయనతో బాటు బండిలో కూచోమన్నాడు.

అక్కడ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు భిక్షపూర్తిఐ చిట్టెన్నగారి వీధి గదిలో కూచుని ఉన్నారు. దర్శనార్థులు, దూరంనుంచే నమస్కరించేవారు. అరుగుపై సాష్టాంగం చేసేవారుగా ఉన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యంద్రభారతి మా మామయ్యసాయంతో బండిదిగి గదిలోనికి వెళ్ళిశ్రీవారికీ వందనంచేశారు. మా మామయ్య కూడ వందనం చేసి, నాచేత వందనం చేయించి శ్రీవారి ఎదుట కూర్చోబెట్టినాడు. వారి మధ్య జరిగిన సంభాషణ తెలియదు. నన్ను పోతన భాగవతంలో సప్తమ స్కంధంలోనుంచి పద్యాలు చదవమన్నాడు మామయ్య.

సీ. ''కంజాక్షునకు( గాని కాయంబు కాయమే?

పవన గుంభిత చర్మభస్త్రి గాక,

వైకుంఠు( బొగడని వక్త్రంబు వక్త్రమే?

ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక,

( 6 - 21 )

హరి పూజనము లేని హస్తంబు హస్తమే?

తరుశాఖ నిర్మిత దర్వి గాక,

కమలేశు జూడని కన్నులు కన్నులే?

తను కుడ్య జాల రంధ్రములు గాక,

ఆ.గీ. చక్రిచింత లేని జన్మంబు జన్మమే?

తరళ సలిల బుద్బుదంబు గాక,

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధు( డే?

పాదయుగముతోడి పశువు గాక.''

చనిపోతానన్న భయంతో నాకు 'చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వైయమః' అనే మకుటంతోచంద్రశేఖరాష్టకం మాతల్లి నేర్పింది ప్రహ్లాదచరిత్ర, కృష్ణశతకం, దాశరథిశతకం, నృసింహశతకం- ఇవికూడ నాకు కంఠస్థం. మరల నింకొకటి చదువమన్నారు శ్రీవారు.

''చంద్రశేఖర! చంద్రశేఖర!చంద్రశేఖర! పాహిమామ్‌,

చంద్రశేఖర!చంద్రశేఖర!చంద్రశేఖర! రక్షమామ్‌.''

''రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం

శింజినీకృత పన్న గేశ్వర మచ్యుతానన (నల) సాయకమ్‌,

క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదిశాలయై రభివందితం

చంద్రశేఖర! మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః''

ఆ పద్యాలు చదువసాగినాను. ఒకపద్యం పూర్తి కాగానే సుబ్రహ్మణ్యంద్ర భారతి నా తలను జగద్గురువుల చరణసరోజాలపై పడవేయడం, జగద్గురువులు నాకు ఒక సపోటాపండును ఇవ్వటం జరిగింది. శ్రీవారు ఈ పద్యాలకు సరియైన భాగవతశ్లోకాలు వివరించేవారు. కొన్ని పద్యాలు రెండు మూడుసార్లు చదివించి విన్నారు. ఇట్లు రెండుగంటల కాలం గడిచింది. పండ్లతో ఒడినిండింది. ఆశీస్సులతో భవిష్యత్తు పండినది. సుబ్రహ్మణ్యంద్ర భారతి కూడ ఒక రుద్రాక్షపూసను నామెడలో కట్టమని మాతల్లికి ఇచ్చారు.

శ్రీవారి ఆశీర్వచన ప్రభావంతో ఎన్నోగండాలు గట్టెక్కినాను. దైవమొక్కడే రక్షింపగల పరిస్థితులు అవి. ఒకప్పుడు ఈనినపంది తరుముకొనివచ్చి, పీనుగను నక్క త్రిప్పినట్లు త్రిప్పింది. నదులలో, చెరువులలో మునిగిపోయాను. చుట్ట చుట్టుకొన్న త్రాచుపై ఆదమరిచి కూరుచున్నా. కాని అన్నిటిలో శ్రీవారి ఆశీర్వచనమే శ్రీరామరక్ష ఐంది.

''చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యత్తి వైయమః.''


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page